Kaleshwaram Project: ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన కాశేళ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ కుంగుబాటు.. నాణ్యత ఎక్కడంటూ కేసీఆర్‌పై పొన్నం ఫైర్

వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్న బీఆర్ఎస్‌కు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. దాదాపు లక్షకోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చూపించి ఎన్నికలకు వెళ్తున్న అధికార పార్టీకి ఇప్పుడు అదే సమస్యగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలున్నాయని, కమిషన్ల కోసమే దానిని నిర్మించారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా గత రాత్రి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు దాని పైనుంచి రాకపోకలు నిలిపివేశారు.

ఇప్పుడిది ప్రతిక్షాలకు అస్త్రమైంది. తాజాగా కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. కమీషన్ల కాళేశ్వరంలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతూ ఆగమేఘాల మీద కేసీఆర్ కమీషన్లకు తలుపులు తెరిచి కట్టించిన కాళేశ్వరంలో నాణ్యత ఎక్కడని ప్రశ్నించారు. నాడు ఒక్క వర్షానికే మోటార్లు పడిపోతే నేడు ఏకంగా వంతెనే కుంగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్మును కాజేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజానీకం క్షమించబోదని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
Kaleshwaram Project
Lakshmi Barrage
Ponnam Prabhakar
KCR
Congress

More Telugu News