మ్యాథ్స్ ట్యూషన్‌కు వెళ్లమని తల్లిదండ్రుల బలవంతం.. 15వ అంతస్తు నుంచి దూకి ఆరోతరగతి బాలిక ఆత్మహత్య

హైదరాబాద్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నారు. ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక చందానగర్‌లో 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల శంషాబాద్‌లో పదో తరగతి విద్యార్థి మై హోం భూజా అపార్ట్‌మెంట్‌లోని 35వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అంతలోనే ఇప్పుడీ బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలవరపాటుకు గురిచేసింది. 

బాధిత బాలికను 12 ఏళ్ల అహానాగా గుర్తించారు. తెల్లాపూర్‌లోని గ్లెండేల్ అకాడమీలో చదువుకుంటోంది. తండ్రి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పదేళ్ల క్రితమే ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి వచ్చారు. చందానగర్‌లోని వారు ఉంటున్న అపర్ణ సరోవర్ అపార్ట్‌మెంట్‌లోనే మ్యాథ్య్ ట్యూషన్‌కు వెళ్లి వచ్చిన బాలిక ఆ తర్వాత కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది. 

బాలిక నిన్న మ్యాథ్స్ ట్యూషన్‌కు వెళ్లడానికి నిరాకరించింది. అయితే, తల్లిదండ్రుల ఒత్తిడితో 4.50 గంటలకు నేరుగా 15వ అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకేసింది. తీవ్రగాయాలపాలైన బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News