అంతర్జాతీయంగా పోతోన్న మీ పరువు గురించి ఆలోచించండి: కెనడాకు భారత్ చురక

MEA on Trudeau allegations of potential Indian involvement in killing of a Khalistani separatist
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో తమకు సంబంధాలు అంటగట్టడంపై, అలాగే కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆ దేశం వ్యవహరిస్తోన్న తీరుపై భారత్ మరోసారి తీవ్రంగా స్పందించింది. ఆ దేశం తీవ్రవాదులకు, అతివాదులకు స్వర్గధామంగా మారిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి మండిపడ్డారు. హర్దీప్ హత్య వెనుక భారత్ హస్తం ఉండవచ్చునని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. హర్దీప్ ఘటన గురించి ఆ దేశం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.

కానీ కెనడాలో జరుగుతోన్న నేరపూరిత కార్యకలాపాలు, వ్యతిరేక శక్తులకు సంబంధించి ఎన్నో ఆధారాలను తాము ఆ దేశానికి ఇచ్చామన్నారు. తమకు 20 నుంచి 25 మంది వ్యక్తులను అప్పగించాలని తాము కెనడాను కొన్నేళ్లుగా కోరామని, కానీ ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. భారత్ డిమాండ్లపై కెనడా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కెనడా వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారుతోందని, తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా ఉంటోందన్నారు. అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోతోందని, దీని గురించి ఆలోచించాలన్నారు.

వీసా సర్వీసుల నిలిపివేతపై కూడా అరీందమ్ స్పందించారు. భద్రతాపరమైన పరిస్థితుల కారణంగా కెనడియన్లకు వీసాలను నిలిపివేశామన్నారు. ఇతర దేశాల నుంచి దరఖాస్తు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలు ఇవ్వలేమన్నారు. వారు భారత్‌కు రాకుండా అడ్డుకోవడం తమ విధానం కాదని స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుకు ముందు జారీ అయిన వారు ఎప్పుడైనా రావొచ్చునని చెప్పారు.

కెనడాలో ఉన్న మన దౌత్యవేత్తల కంటే భారత్‌లో ఉన్న ఆ దేశ దౌత్యవేత్తలు ఎక్కువ అని, ఇరుదేశాల మధ్య సమానత్వం ఉండాలన్నారు. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకుంటున్నారన్నారు. కెనడా భారత్‌లోని తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని సూచించారు. మన వద్ద ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని, కెనడా దౌత్యవేత్తల పట్ల అంతే నిబద్ధతతో ఉన్నామన్నారు. కెనడా కూడా మన దౌత్యవేత్తల భద్రత పట్ల అంతే నిబద్ధతతో ఉండాలన్నారు.
Go Back to Shorts
India
Canada
MEA

More Telugu News