nagam janardhan reddy: గాంధీ భవన్‌తో దూరం పెరగలేదంటూ జూపల్లిపై తీవ్ర విమర్శలు చేసిన నాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాజానికి చీడపురుగులా తయారయ్యాడని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్, ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత భారీ కుంభకోణమన్నారు. అసెంబ్లీలో పెట్టాల్సిన కాగ్ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన పెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని వేల కోట్ల లూటీ జరిగిందని ఆరోపించారు. ఇది ఎవరి సొత్తు అని వేలకోట్లను కేసీఆర్ కాజేశారని ప్రశ్నించారు. రూ.2,525 కోట్లను కాజేసినట్లు కాగ్ నివేదిక వెల్లడించిందన్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం పైనా నాగం స్పందించారు. తనకు గాంధీ భవన్‌తో దూరం పెరగలేదని స్పష్టం చేశారు. తన ఇంటికి ప్రెస్ క్లబ్ చాలా దగ్గర అని, అందుకే ఇక్కడే మీడియా సమావేశం పెట్టినట్లు చెప్పారు. దామోదరరెడ్డిని తానే గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో తాను చాలా సీనియర్ నాయకుడినని చెప్పారు. టిక్కెట్ కోసం తాను ఎప్పుడూ దరఖాస్తు పెట్టలేదని, ఇప్పుడు పార్టీ కార్యకర్తలతో మాట్లాడి దరఖాస్తు విషయం ఆలోచిస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జూపల్లి వస్తే ఏదో జరిగిపోతుందని అందరూ అంటున్నారని, కానీ ఏం జరగదన్నారు. ఆయనకు నాగర్ కర్నూలు, గద్వాల్, కొల్లాపూర్ టిక్కెట్లు కావాలట... అంత పెద్దోడు ఎప్పుడు అయ్యాడో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇక్కడ గెలిచినోడు ఇక్కడే ఉంటాడనే గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు. జగదీశ్వరరావు పార్టీ కోసం సిన్సియర్‌గా పని చేస్తుంటే సడన్‌గా జూపల్లి వచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు.
nagam janardhan reddy
Congress

More Telugu News