మంత్రి అంబటి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన 'బ్రో' చిత్ర నిర్మాత
- టీడీపీ డబ్బుతో బ్రో చిత్రాన్ని తీశారన్న అంబటి!
- బ్రో నిర్మాతకు అమెరికా నుంచి నల్లధనం అందిందని ఆరోపణలు
- అంబటి వ్యాఖ్యలను గాలి మాటలుగా కొట్టిపారేసిన టీజీ విశ్వప్రసాద్
- తాను సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరిక
అంబటి వ్యాఖ్యలపై బ్రో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. మంత్రి అంబటి వ్యాఖ్యలను తాను గాలి మాటలుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఒకవేళ అంబటి వ్యాఖ్యలను తాను తీవ్రంగా పరిగణిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని, ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసని విశ్వప్రసాద్ హెచ్చరించారు.
తన వద్ద పటిష్ఠమైన న్యాయవాదుల బృందం ఉందని, న్యాయపరంగానైనా ఈ విషయాన్ని తేల్చుకోగలనని స్పష్టం చేశారు. తాను ఐటీ రంగం నుంచి వచ్చానని, తాను బ్రో చిత్రాన్ని తీసింది సొంత డబ్బుతోనే అని ఉద్ఘాటించారు. మంత్రి అంబటి చేస్తున్న వ్యాఖ్యలతో తమ చిత్రానికి మరింత పబ్లిసిటీ లభిస్తోందని నిర్మాత విశ్వప్రసాద్ చమత్కరించారు.