Budda Venkanna: ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే వైఎస్ సునీతకు రూ. 500 కోట్లు ఇస్తామన్నది నిజమా? కాదా?: బొండా ఉమ

సొంత మనుషులే ఇంత క్రిమినల్ మైండ్ తో ఉంటారంటూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత చెప్పిన మాటలు ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపానికి నిదర్శనమని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు యత్నించిన వారంతా జైలుకు వెళ్లే సమయం ఆసన్నమయిందని చెప్పారు. హత్య కేసులో సీబీఐ వేసిన అదనపు ఛార్జ్ షీట్ పై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. 

వివేకా హత్య కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే సునీత కుటుంబానికి రూ. 500 కోట్లు ఇస్తామన్నది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. సునీత ఇంటికి జగన్ భార్య భారతి వెళ్లింది నిజమా?కాదా? అని అడిగారు. వివేకా హత్య కేసులో టీడీపీ నేతల పేర్లను చెప్పాలని సునీతకు సూచించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. హత్య కేసు నిందితులను కాపాడేందుకు వ్యవస్థలను జగన్ మేనేజ్ చేశారని ఆరోపించారు. త్వరలోనే ఈ కేసులో ఏ9, ఏ10 పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పారు.
Budda Venkanna
Telugudesam
Jagan
YS Avinash Reddy
YSRCP
CBI
YS Vivekananda Reddy

More Telugu News