ఏపీలో బీజేపీ బలం పుంజుకోవాలి.. పురందేశ్వరి
- సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలంటూ పార్టీ నేతలకు సూచన
- బూత్ కమిటీలు, మండల కమిటీలను బలోపేతం చేయాలన్న బీజేపీ ఏపీ చీఫ్
- రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం నెలకొందని వ్యాఖ్యలు
రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలని పురందేశ్వరి అన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతీ కార్యకర్త శ్రమిస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఎన్నికల హామీలు అన్నింటినీ నెరవేర్చామని జగన్ సహా వైసీపీ నేతలంతా చెబుతున్నారని పురందేశ్వరి గుర్తుచేశారు. నిజంగానే హామీలన్నీ అమలయ్యాయా, ప్రజలు ఏమంటున్నారనేది ప్రత్యక్షంగా కలిసి తెలుసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారని, వారితో పాటు కలిసి సమస్యలపై పోరాడితే బీజేపీని వారు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉందన్న పురందేశ్వరి.. ఈ తక్కువ సమయంలోనే అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పురందేశ్వరి కోరారు.