టైటాన్ జలాంతర్గామిలో లోపాలు చూపిన నిపుణుడిని ఉద్యోగం నుండి తొలగించిన యాజమాన్యం!
- జలాంతర్గామిలో లోపాలు చూపించిన నిపుణుడు
- టైటాన్ తో ముప్పు అని 2018లోనే మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ నివేదిక
- కంపెనీ విషయాలు బహిర్గతం చేస్తున్నారని సదరు నిపుణుడిపై కోర్టులో వ్యాజ్యం
- లోపాలు ఎత్తిచూపినందుకు తనను ఉద్యోగం నుండి తొలగించారని కౌంటర్
టైటాన్ జలాంతర్గామి నిర్మాణం సమయంలో దాని సామర్థ్యంపై ఓ నిపుణుడికి సందేహం వచ్చింది. టైటాన్ కు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని, సముద్రంలో ఇది లోతుకు వెళ్లినప్పుడు ప్రయాణికులకు ముప్పు వాటిల్లవచ్చునని 2018లోనే నాటి ఓషన్ గేట్ సంస్థ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ తన నివేదికలో విశ్లేషించారు. దీనిపై సియాటెల్ కోర్టులో వ్యాజ్యం కూడా దాఖలైంది. కంపెనీ విషయాలను బహిర్గతం చేస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ ఆ నిపుణుడి మీద ఓషన్ గేట్ వ్యాజ్యం వేసింది.
మరోవైపు, టైటాన్ భద్రత గురించి, అందులోని లోపాలను చెప్పినందుకు తనను ఉద్యోగం నుండి తొలగించారని, ఇది అక్రమమని సదరు నిపుణుడు కౌంటర్ దాఖలు చేశారు. అయితే కంపెనీ ఆ రోజునే సదరు నిపుణుడు లేవనెత్తిన నాణ్యత, భద్రత విషయంలో శ్రద్ధ చూపిస్తే ఐదుగురి ప్రాణాలతో బతికి ఉండేవారని నెటిజన్లు అంటున్నారు.