TSRTC: గుండెపోటుతో బస్సులో చనిపోయిన ప్రయాణికుడు.. మృతదేహాన్ని అదే బస్సులో ఇంటికి చేర్చిన డ్రైవర్

ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు చనిపోగా.. మృతదేహాన్ని అదే బస్సులో ఇంటిదాకా తీసుకెళ్లి ఆర్టీసీ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. మహబూబాబాద్ లోని కురవి మండలం మోదుగుల గూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళుతోంది. మార్గమధ్యంలో హుస్సేన్ అనే ప్రయాణికుడు గుండెపోటుకు గురయ్యాడు. 108కి సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. తోటి ప్రయాణికులను విచారించగా హుస్సేన్ కురవి మండలం మోదుగుల గూడెం వాసి అని తెలిసింది.

ప్రయాణికుడు మరణించిన విషయాన్ని డ్రైవర్ డి.కొమురయ్య, కండక్టర్ కె.నాగయ్య ఉన్నతాధికారులకు తెలియజేశారు. మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ సూచనలతో అదే బస్సులో హుస్సేన్ మృతదేహాన్ని మోదుగుల గూడెం తీసుకెళ్లారు. సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించి హుస్సేన్ డెడ్ బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్టీసీ సిబ్బంది నిర్ణయాన్ని ఆ బస్సులోని ప్రయాణికులు ప్రశంసించారు. ఈ విషయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు చేరింది. దీంతో డ్రైవర్, కండక్టర్ లతో పాటు డిపో మేనేజర్ విజయ్ లను ఎండీ సజ్జనార్ శనివారం బస్ భవన్ కు పిలిపించుకుని ముగ్గురినీ అభినందించారు.

TSRTC
Bus
Passenger
heart attack
dead body
MD sajjanar

More Telugu News