Telangana: గుడ్‌న్యూస్.. తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

Rains in the next two days in Telangana
  • తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి
  • ఫలితంగా, దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు
  • గురువారం నల్గొండలో గరిష్ఠంగా 44.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
  • ఏపీలోని ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కసుమూరులో గరిష్ఠంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు ఓ గుడ్‌న్యూస్. నేడు, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. ఫలితంగా, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో, ఈ రెండు రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక గురువారం నల్గొండలో గరిష్ఠంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో కనిష్ఠంగా 23.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

మరోపక్క, భానుడి భగభగలతో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది. గురువారం ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో గరిష్ఠంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీకాకుళం, పల్నాడు, వైఎస్సార్ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.
Telangana

More Telugu News