KCR: హైదరాబాద్ లో ధనవంతులు కూడా రూ. 5 భోజనం తింటున్నారు: కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు హరేకృష్ణ హెరిటేజ్ టవర్ కు శంకుస్థాపన చేశారు. శ్రీకృష్ణ గో సేవామండలి విరాళాలతో ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ ఈ హెరిటేజ్ టవర్ ను హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మిస్తోంది. శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... మత పిచ్చి అత్యంత ప్రమాదకరమని అన్నారు. మత మౌఢ్యం ప్రజలను పిచ్చోళ్లను చేస్తుందని చెప్పారు. దేవుడు కానీ, మతం కానీ హింసకు వ్యతిరేకమని... మధ్యలో వచ్చిన వాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. మనుషులు, దేశాలు, ప్రాంతాలు వేరైనా అందరూ పూజించే పరమాత్ముడు ఒక్కడేనని చెప్పారు. విశ్వశాంతి కోసం మనందరం ప్రార్థన చేయాలని సూచించారు. 

హైదరాబాద్ లో హరేకృష్ణ ఆలయాన్ని నిర్మిస్తుండటం సంతోషకరమని ముఖ్యమంత్రి చెప్పారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరపున రూ. 25 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇస్కాన్ సంస్థ అక్షయపాత్ర ద్వారా చేస్తున్న అన్నదానం చాలా గొప్పదని కేసీఆర్ కితాబునిచ్చారు. అక్షయపాత్ర అందిస్తున్న రూ. 5ల భోజనాన్ని నగరంలోని ధనవంతులు కూడా తింటున్నారని చెప్పారు. అక్షయపాత్ర వంటి కార్యక్రమాలను నిర్వహించాలంటే ఎంతో చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. కరోనా సమయంలో కూడా హరేకృష్ణ ఫౌండేషన్ ఎన్నో సేవలను అందించిందని కొనియాడారు.
KCR
BRS
Hare Krishna
Temple
ISKCON

More Telugu News