ఉరిశిక్ష విధానంపై నిపుణుల కమిటీ: సుప్రీం కోర్టుకు తెలియజేసిన కేంద్రం

Considering setting up of panel to examine execution of death row convicts by hanging
  • ఉరితీత పద్ధతులపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం
  • ప్యానల్ సభ్యుల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
  • తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత ఉంటుందని తెలిపిన సుప్రీం కోర్టు
మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరితీత పద్ధతిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే పద్ధతి సరైనదేనా? ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా? అనే అంశాల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు అవసరమని సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనను కేంద్రం పరిగణలోకి తీసుకుంది.

ప్రతిపాదిత ప్యానల్ లో సభ్యులను ఎంపిక చేసేందుకు కొన్ని ప్రక్రియలు ఉంటాయని, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ అంశంపై స్పందించేందుకు మరింత సమయం కావాలని కోరింది. ఇందుకు అంగీకరించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసులో తదుపరి విచారణ తేదీని వేసవి సెలవుల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

మరణ శిక్ష అమలులో ఉరితీసే పద్ధతికి ఉన్న రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ రిషి మల్హోత్రా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికాలో ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్షను విధిస్తారని, దీంతో పోలిస్తే ఉరి అత్యంత దారుణమని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్షపై ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.
Go Back to Shorts
Supreme Court
Government
death penalty

More Telugu News