భరత్ కుమార్ యాదవ్ కాల్పుల్లో గాయపడ్డ దిలీప్ మృతి

కడప జిల్లా పులివెందులలో ఇవాళ జరిగిన కాల్పుల్లో దిలీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. దిలీప్ కు ఛాతీలో, తలపైనా బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి, దిలీప్ కు ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో పులివెందుల వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కాల్పులు జరిగాయి. భరత్ కుమార్ ఐదు రౌండ్లు కాల్పులు జరపగా... దిలీప్, మహబూబ్ బాషా గాయపడ్డారు. వీరిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

దిలీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో వేంపల్లె వద్ద మృతి చెందాడు. దాంతో అంబులెన్స్ సిబ్బంది అతడిని వేంపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. భరత్ కుమార్ యాదవ్ ఈ ఘటనలో లైసెన్స్ డ్ తుపాకీ ఉపయోగించినట్టు తెలిసింది. వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ కు భరత్ కుమార్ యాదవ్ బంధువేనని భావిస్తున్నారు. వివేకా హత్య కేసులో భరత్ కుమార్ యాదవ్ ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 

కాగా, ప్రస్తుతం దిలీప్ మృతదేహం వేంపల్లె ఆసుపత్రిలోనే ఉంది. కాసేపట్లో పులివెందుల తరలించనున్నారు. అటు, కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్ ఘటన తర్వాత పరారయ్యాడు.

Dileep
Death
Bharat Kumar Yadav
Firing
Pulivendual
Kadapa District

More Telugu News