ఈడీ వద్దు.. సిట్ తో విచారణ జరపాలి.. సుప్రీం ఎదుట ఎమ్మెల్సీ కవిత కొత్త అభ్యర్థన!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారించాలని, తనకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి (అరెస్ట్ లాంటి) చర్యలు తీసుకోవద్దని అందులో కోరారు. మరోవైపు తమను సంప్రదించకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు కవిత ఓ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను ఈడీతో కాకుండా.. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, విచారణ జరపాలని కోరారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌధురి వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తున్నారు. 

ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందంటూ తన పిటిషన్ లో కవిత ఆరోపించారు. సాక్షిగా పిలిచిన మహిళను తమ ఇంటి వద్ద లేదా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని చెప్పారు. కానీ సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉల్లంఘించి.. తనని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. న్యాయవాదుల సమక్షంలో, సీసీ టీవీ కెమెరాల ఎదుట విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

మరోవైపు కేసు విచారణను 3 వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంలో కవిత వేసిన పిటిషన్ ను, నళిని వేసిన పిటిషన్ ను కోర్టు ట్యాగ్ చేసింది. తర్వాతి హియరింగ్ లో రెండు పిటిషన్లను కలిపి విచారించే అవకాశం ఉంది.

Kavitha
Supreme Court
Delhi Liquor Scam
Enforcement Directorate

More Telugu News