Balakrishna: తారకరత్న పేరుతో గుండె సమస్యలకు బాలకృష్ణ ఉచిత వైద్యం... తీవ్ర భావోద్వేగానికి గురైన అలేఖ్య రెడ్డి

హీరో నందమూరి తారకరత్న మృతితో బాలకృష్ణ ఎంతగా చలించిపోయారో అందరికీ తెలిసిందే. తారకరత్నను బతికించుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. ఫిబ్రవరి 22న తారకరత్న తనువు చాలించారు. మరణానంతరం కూడా అన్ని కార్యక్రమాలను బాలయ్య దగ్గరుండి తానే చూసుకున్నారు. ఇప్పుడు తారకరత్న కుటుంబానికి కూడా ఆయనే పెద్ద దిక్కుగా మారారు. తారకరత్న భార్య, పిల్లలకు... మీకు నేను ఉన్నాను అంటూ అండగా నిలబడ్డారు. మరోవైపు తారకరత్న జ్ఞాపకార్థం బసవతారకం ఆసుపత్రిలో ఒక వార్డుకు తారకరత్న పేరును బాలయ్య పెట్టారు. గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఈ వార్డులో ఉచితంగా వైద్య సేవలను అందించనున్నట్టు బాలయ్య ప్రకటించారు. బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మరోసారి బాలయ్య గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆమె స్పందిస్తూ... 'నేను ఏమి చెప్పగలను. మీకు నా కృతజ్ఞలను ఎలా తెలియజేయగలను. మీ గురించి ఏది చెప్పినా తక్కువే అవుతుంది. బంగారు హృదయం కలిగిన గొప్ప వ్యక్తి అని చెప్పడం ఎంతమాత్రం ఆశ్చర్యకరం కాదు. మీకు ఎవరూ సాటి కాదు. మీరు ఒక స్నేహితుడు, తండ్రి కంటే ఎక్కువ. ఇప్పుడు మీలో దేవుడిని చూసుకుంటున్నాను. మీ మంచితనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నా హృదయాంతరాల్లో నుంచి మీకు ధన్యవాదాలు చెపుతున్నాను. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో... అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. జై బాలయ్య' అంటూ ఎంతో భావోద్వేగంగా ఆమె స్పందించారు. అఖండ సినిమాలో అఘోరా రూపంలో ఉన్న బాలయ్య ఫొటోను షేర్ చేశారు.
Balakrishna
Tarakaratna
Alekhya Reddy
Free Heart Treatment
Telugudesam

More Telugu News