మొసలి దాడి.. నదిలో మునిగిపోయిన 8 మంది

మధ్యప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. శివపురి జిల్లా చిలవాడ గ్రామం సమీపంలో చంబల్ నదిలో ఎనిమిది మంది మునిగిపోయారు. 17 మంది కైలాదేవి భక్తులు నదిని దాటే ప్రయత్నం చేయగా.. ఓ మొసలి దాడి చేసింది. దీంతో వారంతా చెల్లాచెదురయ్యారు. శనివారం ఈ ప్రమాదం జరగ్గా మూడు మృతదేహాలను వెలికితీశారు. గజ ఈతగాళ్లు, రక్షణ సిబ్బంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి తీవ్ర గాలింపు చర్యలను చేపట్టారు. తొమ్మిది మంది ప్రాణాలతో బయటపడ్డారు.

మిగిలిన వారి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. భక్తులు అందరూ రాజస్థాన్ లోని కైలాదేవీ ఆలయానికి వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మిగిలిన వారు కూడా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని మొసళ్లు మింగేశాయా? లేదా అన్నది మరికొంత సమయం గడిస్తే కానీ తెలియని పరిస్థితి నెలకొంది. వంతెన లేకపోవడం, పడవ కూడా లేకపోవడంతో వారంతా ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఓ బృందంగా నదిని దాటే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబాలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు.

crocodile
attacked
Kaila Devi devotees
swept away
Chambal river
Madhya Pradesh

More Telugu News