Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో ఉగ్రవాదులను అతి దగ్గర నుంచి చూశాను: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో భాగంగా లండన్ లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. లెర్నింగ్ టు లిజన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశంపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ఆయన ఇటీవల తాను చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను వివరించారు. భారత్ జోడో యాత్ర చివరలో జమ్మూ కశ్మీర్ లో పాదయాత్ర చేస్తుండగా, ఉగ్రవాదులను అత్యంత దగ్గర నుంచి చూశానని వెల్లడించారు. పాదయాత్ర జమ్మూ కశ్మీర్ చేరుకోగానే, ఇక ముందుకు వెళ్లొద్దని భద్రతా సిబ్బంది సూచించారని, కానీ పార్టీ వర్గాలతో చర్చించిన తర్వాత పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. 

"ఆ విధంగా పాదయాత్ర చేస్తుండగా ఓ కొత్త వ్యక్తి నా వద్దకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగానే కశ్మీర్ కు వచ్చి ప్రజల బాధల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ఆ తర్వాత కాస్త అవతల నిలబడి ఉన్న కొందరిని చూపించి వాళ్లంతా టెర్రరిస్టులు అని వెల్లడించాడు. దాంతో నేను సమస్యల్లో చిక్కుకుంటున్నానా అని అనిపించింది. ఆ సమయంలో ఉగ్రవాదులు నన్ను చంపేసేందుకు అవకాశం ఉంది. కానీ వారు అలా చేయలేదు. నా నిబద్ధతను వారు గుర్తించారు. మేం వచ్చింది ప్రజా సమస్యలను వినడానికే అని వారు తెలుసుకున్నారు" అని వివరించారు.
Rahul Gandhi
Terrorists
Jammu And Kashmir
Cambridge
London
Congress

More Telugu News