Sourth Afrcia: బౌలింగ్ వేస్తుంటే అటు తిరిగి దిక్కులు చూస్తున్న అంపైర్.. వీడియో ఇదిగో!

Umpire Marais Erasmus Forgets To Watch Delivery During ODI
  • దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌లో ఘటన
  • జాసన్ రాయ్ క్రీజులో ఉండగా ఘటన
  • బంతిని ఆడాక శబ్దానికి గబుక్కున ఇటు తిరిగిన అంపైర్ ఎరాస్మస్
దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. సాధారణంగా మైదానంలో అంపైర్లు చాలా అప్రమత్తంగా ఉంటారు. అంపైర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే బౌలర్ బంతి వేస్తాడు. అలాంటిది బౌలర్ బంతి సంధిస్తున్నప్పుడు లెగ్ అంపైర్ అటు తిరిగి ఏదో చూసుకుంటూ వేరే ఆలోచనలో ఉంటే? అవును! దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య బ్లోయెమ్‌‌ఫోంటెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. 

బౌలర్ బంతి వేస్తున్న విషయాన్ని పట్టించుకోని లెగ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అటువైపు తిరిగి ఏదో చూసుకుంటున్నాడు. బౌలర్ వేసిన బంతిని ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్ బలంగా బాదాడు. ఆ శబ్దానికి అంపైర్ గబుక్కున ఇటువైపు తిరిగి అప్రమత్తమయ్యాడు. అయితే, అప్పటికే బంతిని ఆడడం, పరుగులు రావడం అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా వాన్ డెర్ డుసెన్ సెంచరీ (111), మిల్లర్ అర్ధ సెంచరీ (53)తో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 271 పరుగులకే కుప్పకూలింది. 

ఓపెనర్ జాసన్ రాయ్ సెంచరీ (113), డేవిడ్ మలాన్ అర్ధ సెంచరీ (59) రాణించినప్పటికీ చివర్లో వరుస పెట్టి వికెట్లు కోల్పోవడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. సఫారీ బౌలర్లలో అన్రిక్ నోకియా నాలుగు వికెట్లు తీసుకోగా, సిసిండ మగల 3 వికెట్లు తీసుకున్నాడు.
Sourth Afrcia
England
Bloemfontein
Marais Erasmus

More Telugu News