బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
- ఈ నెల 29న ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాన్ని ఖరారు చేయనున్న కేసీఆర్
- గవర్నర్ వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం
కొంతకాలంగా గవర్నర్, సీఎంకు మధ్య పడటం లేదు. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. గవర్నర్ పై రాష్ట్ర మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. తమిళిసై పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ ఎంపీలకు ఎలాంటి సూచనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండు విడతలుగా ఏప్రిల్ 6వ తేదీ వరకు జరగనుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఇవ్వనున్నారు. మొత్తం 66 రోజుల పాటు సమావేశాలు ఉంటాయని కేంద్రం తెలిపింది. ఇక కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్నారు.