Nara Lokesh: తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది: నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొన్ని నెలల్లోనే అధికారం చేపట్టిన నందమూరి తారక రామారావు 1983 జనవరి 9న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ జనవరి 9. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వ ప‌తాకాన్ని తెలుగుతేజం నంద‌మూరి తార‌క‌రామారావు గారు స‌గ‌ర్వంగా ఎగ‌ర‌వేసిన రోజు తెలుగుదేశానికి ప‌ర్వ‌దినం అని అభివర్ణించారు. 

అణ‌గారిన‌వ‌ర్గాల అభ్యున్న‌తి, తెలుగుజాతి ఆత్మాభిమానం ప‌రిర‌క్ష‌ణ ల‌క్ష్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెల‌ల్లోనే అధికారంలోకి తెచ్చిన మ‌హానాయ‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు అని కీర్తించారు. ఆయన ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జ‌న‌వ‌రి 9వ తేదీ నిజ‌మైన పండ‌గ‌రోజు అని పేర్కొన్నారు. 

ఎన్టీఆర్ క్ర‌మ‌శిక్ష‌ణ‌, సంపాదించిన‌ కీర్తి, చూపిన‌ స్ఫూర్తి తెలుగుదేశం బ‌లం అని స్పష్టం చేశారు. తెలుగుజాతి ఉన్నంత‌వ‌ర‌కూ తెలుగుదేశం ఉంటుందని నారా లోకేశ్ ఉద్ఘాటించారు. జై తెలుగుదేశం...  జోహార్ ఎన్టీఆర్... అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
Nara Lokesh
NTR
Chief Minister
Andhra Pradesh
Telugudesam
TDP

More Telugu News