కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచండి: ప్రధాని మోదీ

Modi calls for more corona tests
  • భారత్ లో బీఎఫ్-7 వేరియంట్
  • ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమీక్ష
  • వర్చువల్ గా హాజరైన అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ
  • కొత్త వేరియంట్ ను ఎదుర్కొనడంపై మోదీ దిశానిర్దేశం
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నేడు అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, హోంమంత్రి అమిత్ షా వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. 

దేశంలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కొత్త వేరియంట్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచాలని అన్నారు. కరోనా కేసుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ (జన్యు క్రమాల విశ్లేషణ) చేయించాలని నిర్దేశించారు. కరోనా వ్యాక్సిన్ ప్రికాషన్ డోసులను ప్రోత్సహించాలని తెలిపారు.

రాష్ట్రాల ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఆసుపత్రుల్లో పడకలు, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అవసరమైన మందులు, ధరలపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. 

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Advertisement
Narendra Modi
BF-7
Omicron Variant
Corona Virus
India

More Telugu News