Kodali Nani: రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది: కొడాలి నాని

Kodali Nani once again fires on TDP leaders
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ అనేదే లేకుండా చేయాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన బీసీలను నామరూపాల్లేకుండా చేసే కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  

లోకేశ్ కు అడ్డు వస్తాడన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ మనవడ్ని (జూనియర్ ఎన్టీఆర్) తొక్కేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ మనవడు మళ్లీ పార్టీలోకి వచ్చి రాజకీయంగా అడ్డొస్తాడని భావించి, కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ పిల్లలను అనాథలు చేశారని, వారిని చెట్టుకొకరు, పుట్టకొకరుగా గాలికి వదిలేశారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని ఓ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మాట్లాడడం కూడా చేతకాని లోకేశ్ ను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా ఎన్టీఆర్ డీఎన్ఏను పూర్తిగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబును గెలిపిస్తే జరిగేది ఇదేనని వివరించారు. 

చంద్రబాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే ఎంత దమ్ము, ధైర్యం వుంటాయో, అలాంటి వ్యక్తే జగన్ అని, ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కొడాలి నాని వివరించారు. లేకపోతే ఈ 420 వ్యక్తులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేస్తారని పేర్కొన్నారు.
Go Back to Shorts
Kodali Nani
NTR
DNA
YSRCP
TDP

More Telugu News