mobile: ఆటోలో ఫోన్ మర్చిపోయిన యువకుడు.. గూగుల్ పే ద్వారా రూ.50 వేలు చోరీ

50 thousand transfered with lost mobile phone
షార్ట్స్‌లో చూడండి
ఆటోలో మర్చిపోయిన మొబైల్ తో 50 వేలు కొట్టేశాడో దొంగ.. ఫోన్ లోని యూపీఐ ఖాతాల సాయంతో వేర్వేరు ఖాతాలకు నగదు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. బ్యాంకు ఖాతాలో నగదు ఖాళీ అవడంతో సదరు మొబైల్ ఫోన్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఆటో డ్రైవర్ పనే అయుంటుందని ఫిర్యాదు చేశాడు. దీంతో ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ నెల 23న జరిగిన ఈ ఘటన వివరాలు..

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన వీరప్రతాప్ సింగ్ ఇటీవల హైదరాబాద్ కు వచ్చారు. సింగరేణి ఉద్యోగి అయిన వీరప్రతాప్.. ఈఎస్ఐ ఆస్పత్రిలో బంధువును కలిసి బుధవారం తెల్లవారుజామున మంచిర్యాల వెళ్లేందుకు బయల్దేరారు. ఉదయం నాలుగున్నర ప్రాంతంలో సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కారు. అయితే, పంజాగుట్ట దగ్గర వీరప్రతాప్ ను దింపేసి, ఆటో డ్రైవర్ బంజారాహిల్స్ వైపు వెళ్లాడు. ఆటో వెళ్లిపోయాక చూసుకోగా మొబైల్ ఫోన్ కనిపించలేదని వీరప్రతాప్ చెప్పారు.

ఆటో కోసం వెతికినా ఉపయోగంలేక, చేసేదేంలేక వీరప్రతాప్ మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. నో బ్యాలెన్స్ అని చూపించడంతో బ్యాంకును ఆశ్రయించారు. తన ఖాతాలో సొమ్ము మాయమైందని చెప్పగా.. బ్యాంకు సిబ్బంది వివరాలు చెక్ చేశారు. వీరప్రతాప్ గూగుల్ పే, ఫోన్ పే ల నుంచి వివిధ ఖాతాలకు రూ.57,362 ట్రాన్స్ ఫర్ అయ్యాయని చెప్పారు. 

దీంతో మొబైల్ ఫోన్ దొంగిలించిన వ్యక్తే తన ఖాతాలోంచి డబ్బులు కాజేశాడని, హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు. ఆటో ఆనవాళ్ల కోసం ఎర్రగడ్డ నుంచి పంజాగుట్ట వరకు ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Go Back to Shorts
mobile
upi
Hyderabad
auto
google pay

More Telugu News