Imran Khan: దాడి జరుగుతుందని నాకు ముందే తెలుసు: ఇమ్రాన్ ఖాన్

Imran Khan says he knew attack would be happened
  • లాంగ్ మార్చ్ ర్యాలీలో కాల్పులు
  • గాయపడిన ఇమ్రాన్ ఖాన్
  • నేడు వీల్ చెయిర్ లో మీడియా ముందుకు వచ్చిన ఇమ్రాన్
  • నలుగురు వ్యక్తులు తనపై కుట్ర పన్నారని వెల్లడి
లాంగ్ మార్చ్ ర్యాలీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో గాయపడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ప్రజల ముందుకు వచ్చారు. వీల్ చెయిర్ లో కూర్చున్న ఇమ్రాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనపై జరిగిన దాడి పట్ల స్పందించారు. 

దాడి జరుగుతుందన్న విషయం తనకు ఒకరోజు ముందే తెలుసని అన్నారు. వజీరాబాద్ లో కానీ, గుజ్రాత్ లో కానీ తనను చంపేయడానికి ప్రణాళిక రచించారని తనకు సమాచారం ఉందని ఇమ్రాన్ ఖాన్ వివరించారు. 

"ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. నా హత్యకు నలుగురు వ్యక్తులు కుట్ర పన్నారు. దీనికి సంబంధించి అన్ని వివరాలతో ఓ వీడియో సిద్ధం చేశాను. నాకేదైనా అయితే ఆ వీడియో విడుదల చేయమని మావాళ్లకు చెప్పాను. నేను కంటైనర్ పై నిల్చుని ఉండగా, ఉన్నట్టుండి నా కాళ్లకు బుల్లెట్లు తాకాయి. మొత్తం 4 బుల్లెట్లు తగలడంతో పడిపోయాను. అక్కడ ఇద్దరు దుండగులు కనిపించారు. వారిద్దరూ ఒకేసారి కాల్పులు జరిపి ఉంటే ఇవాళ నేను బతికేవాడ్ని కాను" అంటూ తన ప్రసంగంలో వివరించారు. 

అంతేకాదు, తన కాలికి తగిలిన బుల్లెట్ గాయాల ఎక్స్ రే చిత్రాలను డాక్టర్ సాయంతో ప్రదర్శించారు.
Imran Khan
Attack
Firing
PTI
Pakistan

More Telugu News