Shreyas Iyer: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు టీమిండియాలో శ్రేయాస్, ఉమేశ్ యాదవ్, షాబాజ్ అహ్మద్ లకు స్థానం

నేటి నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. కాగా, ఈ సిరీస్ కోసం టీమిండియాను ఇదివరకే ఎంపిక చేసినా, తాజాగా శ్రేయాస్ అయ్యర్, ఉమేశ్ యాదవ్, షాబాజ్ అహ్మద్ లకు కూడా జట్టులో స్థానం కల్పించారు. 

దీపక్ హుడా గాయంతో బాధపడుతుండగా, కోలుకునే నిమిత్తం అతడిని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి పంపించారు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ కూడా కండిషనింగ్ నిమిత్తం ఎన్సీఏలోనే ఉన్నారు. 

ఈ నేపథ్యంలో, శ్రేయాస్ అయ్యర్, ఉమేశ్, షాబాజ్ లను ఎంపిక చేసినట్టు బీసీసీఐ వెల్లడించింది. ఇక, కరోనా బారినపడిన టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పూర్తిగా కోలుకున్నదీ, లేనిదీ బీసీసీఐ నిర్ధారించలేదు. షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్ ను, దీపక్ హుడా స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను తీసుకున్నామని, టీ20 జట్టుతో షాబాజ్ అహ్మద్ కూడా కలుస్తాడని బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. 

నేడు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తిరువనంతపురంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, సఫారీలతో టీ20 సిరీస్ ను టీమిండియా మేనేజ్ మెంట్ సన్నాహకంగా భావిస్తోంది.
Shreyas Iyer
Umesh Yadav
Sabaz Ahmed
Team India
South Africa
T20 Series

More Telugu News