Saudi Arabia: సౌదీ అరేబియా జైలులో గుండెపోటుతో జగిత్యాల జిల్లా వాసి మృతి

  • ఉపాధి కోసం సౌదీ వెళ్లిన మన్నేగూడెం వాసి
  • వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నందుకు అరెస్ట్
  • అనారోగ్యం పాలైన రాజయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మృతి
  • మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు
telangana worker died in saudi arabia jail

ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండి, పోలీసులకు చిక్కి జైలు పాలైన తెలంగాణ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నేగూడేనికి చెందిన రాజయ్య కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. వీసా గడువు ముగిసినా స్వదేశం రాకుండా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత కరోనా కారణంగా పరిస్థితులు మరింత కఠినంగా తయారయ్యాయి. దీంతో స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నించాడు. 

రాజయ్య ఆ ప్రయత్నాల్లో ఉండగానే.. పోలీసులకు పట్టుబడ్డాడు. వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా ఉంటున్నందుకు అరెస్ట్ చేసి రియాద్‌లోని డిపోర్టేషన్ సెంటర్‌కు తరలించారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆగస్టు 15న జైలు నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. నిన్న జైలును సందర్శించిన భారత రాయబార కార్యాలయ అధికారులకు రాజయ్య మృతి విషయం తెలిపారు. రాజయ్య మృతదేహాన్ని స్వదేశం తరలించేందుకు భారత అధికారులు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News