సీటు బెల్ట్ విషయంలో ఇక కఠిన నిబంధనలు!
- అలారమ్ వ్యవస్థలో మార్పులు
- మధ్య సీట్లకూ బెల్ట్ లు
- క్లిప్పులు లేకుండా చర్యలు
- త్వరలోనే కొత్త ఆదేశాలు
- వెల్లడించిన అధికార వర్గాలు
షాపూర్ జీ పల్లోంజీ గ్రూపు వారసుడైన సైరస్ మిస్త్రీ సీటు బెల్ట్ ధరించక ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. నిబంధనలను కఠినతరం చేసే విషయమై కేంద్రం దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్ర రవాణా శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సీట్ బెల్ట్ అలారమ్ ను ఆపేయడాన్ని నిషేధించనుంది. కారులో ఆరు ఎయిర్ బ్యాగ్ లను తప్పనిసరి చేయనుంది. కారు సీటు మధ్య భాగంలో ముందు, వెనుక కూడా సీటు బెల్ట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వనుంది. సీట్ బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో ప్రచారం నిర్వహించనుంది.
ఈ ఆదేశాలను తాము రూపొందిస్తున్నామని, త్వరలోనే వీటిని ప్రకటించనున్నట్టు కేంద్ర రవాణా శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. సీటు బెల్ట్ లకు క్లిప్పులను నిషేధించనున్నట్టు చెప్పారు. కారులో సీటు బెల్ట్ ధరించకపోతే ఆటోమేటిగ్గా గుర్తించి చర్యలు తీసుకునే వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవలే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రకటించడం గమనార్హం.