చార్టర్డ్ ఫ్లైట్ టేకాఫ్ క్లియరెన్స్ కోసం ఏటీసీ రూమ్ లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ ఎంపీలు

  • అనుమతి లేని రాత్రి సమయంలో టేకాఫ్ కు అనుమతి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి
  • ఝార్ఖండ్ లోని దేవఘర్ విమానాశ్రయంలో ఘటన
  • ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీపై ఎఫ్ఐఆర్
ఝార్ఖండ్‌లోని దేవఘర్ విమానాశ్రయం నుంచి అనుమతి లేని రాత్రి సమయంలో తమ చార్టర్డ్ ఫ్లైట్‌ టేకాఫ్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేసినందుకు బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విమానాశ్రయ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు మేరకు బీజేపీ నేతలపై కేసు నమోదు చేశారు. నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌ సహా తొమ్మిది మంది వ్యక్తులపై ఇతరుల ప్రాణాలు, భద్రతకు అపాయం కలిగించడంతో పాటు నేరపూరిత నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఆగస్టు 31న లోక్‌సభ సభ్యుడు నిషికాంత్ దూబే, ఆయన కుమారుడు కనిష్క్ కాంత్ దూబే, మహికాంత్ దూబే, ఎంపీ మనోజ్ తివారీ, ముఖేష్ పాథక్, దేవతా పాండే, పింటూ తివారీలు భారీ భద్రత ఉండే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) రూమ్ లోకి ప్రవేశించారు. దేవఘర్ విమానాశ్రయం నుంచి తమ చార్టర్డ్ ఫ్లైట్ టేకాఫ్ కావడానికి క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. 

అయితే, కొత్తగా ప్రారంభమైన విమానాశ్రయం నుంచి రాత్రి కార్యకలాపాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. సదరు ఎయిర్ పోర్టులో విమాన సేవలు ప్రస్తుతం సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ, సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 6:03 గంటల సమయంలో బీజేపీ నేతలు అనుమతి కోసం ఏటీసీలోకి వచ్చారు. వాళ్ల ఫ్లైట్ సాయంత్రం 6:17 గంటలకు అక్కడి నుంచి బయలుదేరింది.

మరోపక్క, తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై నిశికాంత్ దూబే స్పందిస్తూ, తమ ఫ్లైట్ టేకాఫ్ కు విమానాశ్రయం అథారిటీ అభ్యంతరం చెప్పలేదన్నారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నామని తెలిపారు. కేసుపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని, సంఘటనపై తమ వాదనను వినిపిస్తామన్నారు.

మరోవైపు ఈ ఘటనపై ఐఏఎస్ అధికారి, దేవఘర్ జిల్లా మేజిస్ట్రేట్ మంజునాథ్ భజంత్రీ, ఎంపీ దూబే మధ్య ట్విట్టర్లో వాగ్వాదం నడించింది. బీజేపీ నాయకులు భద్రతా నిబంధనలను పట్టించుకోకపోవడం, బలవంతంగా తమ విమానానికి క్లియరెన్స్ పొంది జాతీయ భద్రతను ఉల్లంఘించారని మంజునాథ్ ట్వీట్ చేశారు. ఇద్దరు, పిల్లలు, మద్దతుదారులతో ఏటీసీ రూమ్ లోకి ప్రవేశించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అని ఎంపీని ప్రశ్నించారు.

దీన్ని దూబే తిప్పికొడుతూ, ‘ఏవియేషన్ నిబంధనలను మళ్లీ అధ్యయనం చేయమని మీకు సూచిస్తున్నా. ఒక ఐఏఎస్ అధికారిగా, దేశం మీ నుంచి మంచిని ఆశిస్తోంది. ఇప్పుడు ఈ విషయం న్యాయ విచారణలో ఉంది. కాబట్టి ఏవియేషన్, ఎయిర్ పోర్ట్  రూల్స్ చదివిన తర్వాతే స్పందించండి’ అని ట్వీట్ చేశారు.

BJP
MPs
Nishikant Dubey
Manoj Tiwari
forcing flight take off
fir

More Telugu News