తనీష్, వికాస్ వశిష్ట హీరోలుగా 'అంతేలే కథ అంతేలే'... సెప్టెంబరు నుంచి షూటింగ్
- శ్రీ ఎం నివాస్ దర్శకత్వంలో చిత్రం
- అనంతపురం బ్యాక్ డ్రాప్ లో చిత్రం
- ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రబృందం
- హాజరైన నటీనటులు, ఇతర టెక్నీషియన్లు
చిత్ర దర్శకుడు శ్రీ ఎం నివాస్ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథతో సినిమా తెరకెక్కిస్తున్నామని, అనేక భావోద్వేగాలు ఈ సినిమాలో మిళితమై ఉంటాయని తెలిపారు. ఈ చిత్రాన్ని అనంతపురం, నల్గొండ, హైదరాబాద్ లలో మూడు షెడ్యూల్ లలో చిత్రీకరిస్తామని వెల్లడించారు.
హీరో తనీష్ మాట్లాడుతూ... ఇలాంటి సినిమాలను తీసేందుకు చాలా తక్కువ మంది ప్రయత్నిస్తారని, అయితే ఈ తరహా సినిమాలు తక్కువగానే వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపారు. ఇప్పటి వరకు తనకున్న ఇమేజ్, తను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్ తో కూడిన పాత్ర ఇదని తనీష్ పేర్కొన్నారు. ఇందులో మానవ సంబంధాలు చాలా కొత్తగా ఉంటాయని, ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు గుండెలు బరువెక్కుతాయని అన్నారు. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమామంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.
మరో హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ... 'సినిమా బండి' తరువాత 'అంతేలే కథ అంతేలే' చిత్రంలో నటిస్తున్నానని అన్నారు. ఈ సినిమా టైటిల్ లోనే కథ ఉందని, ఇందులో మంచి ఎమోషన్ ఉంటుందని తెలిపారు. మంచి టీం దొరికిందని, నివాస్ గారు ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చిందని వివరించారు. ఇందులో ఎక్కువ మాటలు ఉండవు కానీ ఎమోషన్ కథను ముందుకు తీసుకెళుతుందని వికాస్ వశిష్ట వెల్లడించారు. ఈ సినిమా కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
హీరోయిన్ సహర్ కృష్ణన్ మాట్లాడుతూ... తన యాక్టింగ్ చూడకుండానే ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు తనను సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తనకిచ్చిన పాత్రను 100 శాతం ప్రేక్షకులను మెప్పించేలా పోషిస్తాను అని అన్నారు.
ఈ చిత్రంలో అలనాటి నటీమణి గీతాంజలి తనయుడు శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటి గీతాంజలి రామకృష్ణ గారి అబ్బాయినని వెల్లడించారు. ఇంతకుముందు తాను కొన్ని సినిమాలు చేశానని, 'అంతేలే కథ అంతేలే' సినిమాలో నాకు మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికింది అన్నారు.
.