CM Jagan: దత్తపుత్రుడు కాపుల ఓట్లను మూటగట్టి మరోసారి చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మేస్తాడు: సీఎం జగన్

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ విపక్షనేతలపై ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాజకీయాలు మరింత దిగజారిపోయాయని వ్యాఖ్యానించారు. కాపుల ఓట్లను కొంతమేర అయినా మూటగట్టి చంద్రబాబుకు మరోసారి హోల్ సేల్ గా అమ్మేసేందుకు దత్తపుత్రుడు రాజకీయాలు చేస్తున్నాడంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ ను సీఎం విమర్శించారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దుష్ట చతుష్టయానికి దత్తపుత్రుడు కూడా తోడయ్యాడని అన్నారు.

"వీళ్ల మాదిరిగా నాకు దత్తపుత్రుడు లేకపోవచ్చు. వీళ్ల మాదిరిగా నాకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. వీళ్ల మాదిరిగా నాకు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు. వీళ్ల మాదిరిగా నాకు టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. కానీ ఒక్క విషయం చెబుతాను. వీళ్లకు లేనిది నాకు ఉన్నది ఈ ప్రజల దీవెనలు, ఆ దేవుడి ఆశీస్సులు" అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 

తాము కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ అనేది చూడకుండా సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. అర్హత ఒక్కటే ప్రమాణంగా తీసుకుని మంచి చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మనం డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) చేస్తుంటే చంద్రబాబు హయాంలో డీపీటీ చేసేవారని విమర్శించారు. 'డీపీటీ' అంటే 'దోచుకో పంచుకో తినుకో' అంటూ ఎద్దేవా చేశారు.
CM Jagan
Chandrababu
YSR Kapu Nestham
Gollaprolu
YSRCP
Andhra Pradesh

More Telugu News