Monsoon: మరింత బలపడిన రుతుపవనాలు... ఏపీలో విస్తారంగా వర్షాలు

ఏపీలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడ్డాయి. మరోవైపు ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, కర్ణాటకపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. 

కాగా, ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం సగటున అత్యధికంగా 3.1 సెంమీ వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం నుంచి విజయవాడలో వర్షం కురుస్తూనే ఉంది. 

మండపేటలో అత్యధికంగా 10.1 సెంమీ వర్షపాతం నమోదైంది. అమరావతిలో 8.7 సెంమీ, మంగళగిరిలో 6.9 సెంమీ, కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 7.9 సెంమీ, పల్నాడు జిల్లా మద్దాలిలో 7.1 సెంమీ, కృష్ణా జిల్లా ఉంగుటూరులో 6.7 సెంమీ, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 6.6 సెంమీ, ఎన్టీఆర్ జిల్లా నున్న (విజయవాడ శివారు)లో 6.4 సెంమీ వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లాలో 1.5 సెంమీ, గుంటూరు జిల్లాలో 1.4 సెంమీ సగటు వర్షపాతం నమోదైంది.
Monsoon
Rain
Andhra Pradesh
Forecast

More Telugu News