హైదరాబాదులో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గం తొలిరోజు సమావేశాలు

BJP National Plenary first day meetings concluded
  • హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ సమావేశాలు
  • హాజరైన మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ తదితరులు
  • రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా
  • ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్ నాథ్ సింగ్
  • బలపరిచిన పియూష్ గోయల్
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కాషాయ దళ అగ్రనేతలందరూ హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలు తొలిరోజు ముగిశాయి. కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపై ఈ సమావేశాల్లో చర్చించారు. అంతకుముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై చర్చ జరిగింది. అనంతరం ఆ తీర్మానాన్ని ఆమోదించారు. 

ఆ తర్వాత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్ బలపరిచారు. ఈ తీర్మానం కింద కేంద్ర ప్రభుత్వ పథకాలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సుస్థిర అభివృద్ధి కొనసాగుతోందని అన్నారు. 

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో భారత్ లో కులతత్వ, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు అడ్డుకట్ట పడిందని వివరించారు. ఇప్పుడు అభివృద్ధి చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయని నడ్డా స్పష్టం చేశారు. కాగా, రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి.
Go Back to Shorts
BJP
Plenary
First Day Meetings
Hyderabad

More Telugu News