బీటెక్ విద్యార్థులే లక్ష్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది: రాయపాటి శైలజ

Rayapati Sailaja organised awareness campaign on human trafficking
  • ట్రాఫికింగ్ పై విజయవాడలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన రాయపాటి శైలజ
  • ట్రాఫికింగ్ అనేక రూపాల్లో జరుగుతుందన్న శైలజ
  • ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాలకు తీసుకెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొనేలా చేస్తున్నారని వెల్లడి
మానవ అక్రమ రవాణాపై (ట్రాఫికింగ్) రాష్ట్ర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా రైల్వే పోలీసులతో కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. 

ట్రాఫికింగ్ అనేది అనేక రూపాల్లో జరుగుతుందని శైలజ తెలిపారు. యువతను సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తున్నారని... ముఖ్యంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులను విదేశాలకు పంపిస్తామని చెప్పి, అక్కడకు తీసుకెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొనేలా చేస్తున్నారని తెలిపారు. ఇది కొత్త రకం ట్రాఫికింగ్ అని చెప్పారు.

అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు విశాఖపట్నంలో రోబోటిక్ సిస్టమ్ వంటి ఆధునిక టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపారు. బాధితులను కేవలం రక్షించడమే కాకుండా, వారు అనుభవించే మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా అవసరమని ఆమె పేర్కొన్నారు. అపరిచితులతో సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. 
Advertisement
Rayapati Sailaja
TDP
Human Trafficking

More Telugu News