TDP: వైసీపీ విధానాల‌తో పోల‌వ‌రానికి న‌ష్టం... కేంద్ర మంత్రికి చంద్ర‌బాబు ఫిర్యాదు

chandrababu writes a letter to union minister gajendra singh shekhawat over polavaram project
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న విధానాల వ‌ల్లే పోల‌వ‌రం ప్రాజెక్టుకు తీవ్ర న‌ష్టం వాటిల్లుతోందంటూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయ‌న బుధ‌వారం కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు ఓ లేఖ రాశారు. పోలవ‌రం ప్రాజెక్టుకు ఇప్ప‌టిదాకా జ‌రిగిన న‌ష్టం, డ‌యాఫ్రం వాల్ దెబ్బ‌తిన‌డానికి గ‌ల కార‌ణాలు, ప్రాజెక్టుపై వైసీపీ వైఖరి త‌దిత‌రాల‌ను స‌ద‌రు లేఖలో చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. 

వైసీపీ ప్ర‌భుత్వ త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో ప్రాజెక్టుకు న‌ష్టం జ‌రుగుతోంద‌ని చంద్ర‌బాబు సద‌రు లేఖ‌లో ఆరోపించారు. వైసీపీ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో పోల‌వ‌రం ప్రాజెక్టుకు న‌ష్టం జ‌రుగుతోందన్న ఆయ‌న‌... ఇప్పటికే ప్రాజెక్టుకు సాంకేతికంగా న‌ష్టం జ‌రిగిందని కూడా తెలిపారు. ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయ‌డం ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ చూప‌డం లేదని ఆయ‌న ఫిర్యాదు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జ‌రుగుతోందని తెలిపిన చంద్ర‌బాబు... ప్రాజెక్టు స‌త్వ‌ర పూర్తికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. 

ప్రాజెక్టు ప‌నులు మ‌ధ్య‌లో నిలిచిపోయిన కార‌ణంగానే డ‌యాఫ్రం వాల్ దెబ్బ‌తిన్న‌ద‌ని చంద్ర‌బాబు తెలిపారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో ప్రాజెక్టు ప‌నుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కంపెనీకి అప్ప‌గించింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలో ఆక‌స్మికంగా ప‌నుల నిలిపివేత‌తో కొత్త ఏజెన్సీ ప‌నుల‌కు 6 నెల‌ల స‌మ‌యం ప‌ట్టిందని ఆయ‌న వివ‌రించారు. ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే డ‌యాఫ్రం వాల్ దెబ్బ తిన్న‌దని, ప‌నుల ఆల‌స్యంపై వైసీపీ ప్ర‌భుత్వాన్ని టీడీపీ హెచ్చ‌రించిందని కూడా ఆయన తెలిపారు.
Go Back to Shorts
TDP
Andhra Pradesh
Polavaram Project
Gajendra Singh Shekhawat
Chandrababu

More Telugu News