వెంకయ్యనాయుడితో భేటీ అయిన అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్

రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఎవరు అనే విషయంపై ఎలాంటి సంకేతాలు బయటకు రాలేదు. అయితే ఈరోజు జరిగిన పరిణామం ఆసక్తికరంగా మారింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల సేపు వీరి భేటీ కొనసాగింది. 

యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం సికింద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే క్రమంలో ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ఈ తరుణంలో వెంకయ్యతో పార్టీ నేతలు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎన్డీయే తరపున పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ... వారిలో వెంకయ్యనాయుడి వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.


More Telugu News