లాభాలు కురిపించని ఎల్ఐసీ.. రూ.867 వద్ద లిస్టింగ్
- ఐపీవో ధర రూ.949
- రిటైల్ ఇన్వెస్టర్ల ధర రూ.905
- పాలసీదారులకు కేటాయించిన ధర రూ.889
- ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నది రూ.900 వద్ద
లక్షలాది మంది పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్లర్లు ఐపీవోలో ఉత్సాహంగా పాల్గొనడం తెలిసిందే. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుత లిస్టింగ్ ఎలా ఉన్నా సమస్య ఉండదు. కానీ, లిస్టింగ్ రోజు లాభానికి విక్రయిద్దామనుకున్న వారే వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.
అయితే, ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న ధర రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన ధర కంటే ఎక్కువే కావడం గమనించాలి. పాలసీదారుల కోటాలో దరఖాస్తు చేసుకున్న వారికి ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపు ఇచ్చారు. అంటే పాలసీదారులకు ఒక్కో షేరు రూ.889కే లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.45 తగ్గింపు ఇచ్చారు. అంటే వారికి ఒక్కో షేరు రూ.904కు వచ్చింది.
ఐపీవోలో భాగంగా ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన వాటాల నుంచి 3.5 శాతం మేర విక్రయించి రూ.20,557 కోట్లను సమీకరించడం తెలిసిందే. సుమారు 22 కోట్ల షేర్లను విక్రయించింది. ఎల్ఐసీ ఉద్యోగులకు సైతం ఒక్కో షేరును రూ.904కే కేటాయించారు.