Manthena Satyanarayana Raju: రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత భర్తను లెక్క చేయడం లేనట్టుంది: టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సెటైర్

హైదరాబాద్, వైజాగ్ లలో తమిళ స్టార్ హీరోలు సినిమా షూటింగులు పెట్టుకోవద్దని ఏపీ మంత్రి రోజా భర్త, తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు స్పందిస్తూ... ఏపీలో షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరని ప్రశ్నించారు. రాష్ట్ర పర్యాటక మంత్రి రోజా భర్త చేసిన వ్యాఖ్యలు ఏపీకి నష్టాన్ని చేకూర్చేలా ఉన్నాయని అన్నారు. 

ఓవైపు ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తానని రోజా అంటుంటే... మరోవైపు ఆమె ప్రకటనలకు విరుద్ధంగా ఆమె భర్త మాట్లాడుతున్నారని సత్యనారాయణరాజు విమర్శించారు. వీరిద్దరి ప్రకటనల వెనుక ఉన్న తేడా దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. పరిస్థితులు చూస్తుంటే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయని... మంత్రి అయిన తర్వాత తన భర్త మాటను రోజా వినడం లేదని అనిపిస్తోందని అన్నారు. అందుకే రోజాకు, ఏపీకి నష్టాన్ని చేకూర్చేలా సెల్వమణి మాట్లాడుతున్నారని చెప్పారు. 

భర్త చేసిన వ్యాఖ్యలకు రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు రోజా చేసిందేమీ లేదని... రాష్ట్రంలో ఒక్క పర్యాటక ప్రాంతాన్నైనా సందర్శించారా? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో పర్యటించడం తప్ప ఆమె చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
Manthena Satyanarayana Raju
Telugudesam
Roja
YSRCP
RK Selvamani

More Telugu News