Khalid Payenda: వాషింగ్టన్ వీధుల్లో ఊబర్ క్యాబ్ నడుపుతున్న ఆఫ్ఘానిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి

  • జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలు
  • ఒక సెమిస్టర్ కు 2,000 డాలర్లే
  • అదనపు ఆదాయానికి ఊబర్ సేవలు
  • వాషింగ్టన్ పోస్ట్ కు ఖలీద్ పయేంద్ర ఇంటర్వ్యూ
Afghanistans last finance minister Khalid Payenda now drives Uber in US

ఒక దేశానికి మంత్రిగా సేవలు అందించిన వారు.. పదవీ విరమణ తర్వాత కూడా మంచి స్థితిలోనే ఉంటారని భావిస్తుంటాం. కానీ, ఆప్ఘానిస్థాన్ చివరి ఆర్థిక మంత్రి ఖలీద్ పయేంద్ర పరిస్థితి వేరు. ఆయన వాషింగ్టన్ లో ఊబర్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కాబూల్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడానికి కొన్ని రోజుల క్రితం వరకు ఆయన అష్రఫ్ ఘని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 

తాలిబాన్ల ఏలుబడికి వదిలేసి అమెరికా సేనలు అఫ్ఘానిస్థాన్ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోవడంతో ఖలీద్ పయేంద్రకు కూడా మరో ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో వాషింగ్టన్ చేరుకుని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కానీ, ఒక సెమిస్టర్ కు ఆయనకు చెల్లించేది 2,000 డాలర్లు. ఇది చాలక ఊబర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. వాషింగ్టన్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో అంశాలను వెల్లడించారు.

‘‘లెబనీస్ కంపెనీకి చెల్లింపులు చేయడంలో విఫలమైందంటూ అష్రఫ్ ఘనీ ఆర్థిక శాఖను ఎత్తి చూపడంతో.. తప్పుడు ఆరోపణల కింద నన్ను అరెస్ట్ చేస్తారేమోనన్న భయం కలిగింది. దాంతో వెంటనే దేశాన్ని వీడి అమెరికాకు కుటుంబంతోపాటు వారం ముందే వచ్చేశాను. ఇప్పుడు నాకు ఎక్కడా చోటు లేదు. నేను ఇక్కడి వాడిని కాదు. అక్కడి వాడిని కూడా కాదు. ఎంతో శూన్య భావన కలుగుతోంది’’అని చెప్పారు. 

అప్ఘాన్లను అమెరికా అనాధలుగా వదిలేసిందని, అఫ్ఘనిస్థాన్ ను సమష్టిగా నిర్మించుకుందామనే సంకల్పం కూడా లేదన్నారు. ‘‘మేము అవినీతిపై పేక ముక్కలతో ఇంటిని నిర్మించుకున్నాం. అందుకే అంత వేగంగా కుప్పకూలింది. బక్క పలుచగా ఉన్నా ప్రభుత్వం దోచుకోవాలనే చూసింది. మా ప్రజలకు ద్రోహం చేశాం’’అని పయేంద్ర వివరించారు.

More Telugu News