ఇంట్లో తల్లి మృతదేహం.. అమ్మ నిద్రపోతోందని భావించి.. నాలుగు రోజులుగా స్కూలుకు వెళ్లొస్తున్న బాలుడు!

 ten year old kid who was going to school for four days without knowing that his mother was dead
షార్ట్స్‌లో చూడండి
తల్లి చనిపోయిన విషయం తెలియని పదేళ్ల కుమారుడు నాలుగు రోజులుగా స్కూలుకు వెళ్లి వస్తున్న విషాద ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. తల్లి నిద్రపోతోందని భావించిన కుమారుడు ఆమెను లేపడం ఇష్టం లేక ఇంట్లో ఉన్న పదార్థాలను తింటూ గడిపేశాడు. చివరికి ఇంట్లోంచి దుర్వాసన వస్తోందంటూ మేనమామకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన రాజ్యలక్ష్మి భర్తతో విభేదాల నేపథ్యంలో పదేళ్ల కుమారుడు శ్యామ్ కిషోర్‌తో కలిసి విడిగా ఉంటోంది. ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి ఈ నెల 8న ఇంట్లో కిందపడి మృతి చెందారు. 

అయితే, తల్లి మరణించిన విషయాన్ని తెలుసుకోలేని కుమారుడు శ్యామ్.. అమ్మ నిద్రపోతోందని భావించాడు. ఆమెను నిద్రలేపడం ఇష్టం లేక నాలుగు రోజులుగా స్కూలుకెళ్లి వస్తూనే ఉన్నాడు. మంచం పక్కన తల్లి మృతదేహం పక్కనే పడుకునేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను తింటూ గడిపేశాడు.

అయితే, అప్పటికీ అమ్మ చనిపోయిందన్న విషయాన్ని పసిగట్టని శ్యామ్..  ఈ ఉదయం ఇంట్లో దుర్వాసన వస్తోందంటూ తన మేనమామ దుర్గాప్రసాద్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయనొచ్చి సోదరి మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శ్యామ్ మానసిక స్థితి సరిగా లేదని దుర్గాప్రసాద్ తెలిపారు.
Go Back to Shorts
Tirupati
Andhra Pradesh
Mother
Kid

More Telugu News