అసెంబ్లీ తీర్మానాలు చెల్లవని హైకోర్టు చెప్పడం దారుణం: మోదుగుల

  • న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలి
  • కోర్టులు వాటికి అవసరమైన అంశాలనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి
  • రాష్ట్ర విభజనపై వేసిన కేసులను కోర్టులు ఎందుకు స్వీకరించడం లేదు?

రాజధాని అంశంలో చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థల్లో ఎవరు గొప్ప? అనే విషయంపై చర్చ జరగాలని అన్నారు. 

న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరుస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ పైకి తీసుకోవడం లేదని... వారికి అవసరమైన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయని అన్నారు. 

రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దేశ ప్రజలందరికీ తెలుసని... రాష్ట్ర విభజనపై వేసిన పిటిషన్లను కోర్టులు ఎందుకు స్వీకరించడం లేదని మోదుగుల ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టు చెప్పడం బాధాకరమని అన్నారు. మూడు రాజధానులకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన పిటిషన్ లపై కోర్టులు ముందు తీర్పులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Modugula Venugopal Reddy
YSRCP
AP High Court
Amaravati

More Telugu News