రాహుల్ గాంధీ ఇటలీ పర్యటనపై దుమారం.. కాంగ్రెస్-బీజేపీ మధ్య విమర్శల యుద్ధం
- రాహుల్ది బాధ్యతా రాహిత్యమన్న బీజేపీ
- అది స్వల్ప కాలిక వ్యక్తిగత పర్యటన అన్న కాంగ్రెస్
- రూమర్లు ప్రచారం చేయొద్దని వినతి
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి నెల మధ్యలో ఈ ఎన్నికలకు సంబంధించి ఈసీ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ ఇటలీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది.
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ రాహుల్ ఇటలీ పర్యటనకు వెళ్లడం బాధ్యతారాహిత్యం కాక మరేమిటని బీజేపీ విమర్శించింది. ఆయన విదేశీ పర్యటనల లెక్కలను కూడా వెలికి తీస్తోంది. కాగా, 2015 నుంచి 2019 మధ్య కాలంలో రాహుల్ గాంధీ 247 సార్లు విదేశాలకు వెళ్లారని గతంలో అమిత్ షా పార్లమెంటుకు తెలిపారు. పర్యటనల సమయంలో ఆయన ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని విమర్శించారు.
రాహుల్ పర్యటనపై బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఇది స్వల్ప కాలిక పర్యటన మాత్రమేనని, దీనిని రాద్ధాంతం చేయొద్దని బీజేపీని కోరింది. జనవరి 3న పంజాబ్లోని మోగాలో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి రాహుల్ హాజరవుతారని సూర్జేవాలా పేర్కొన్నారు.