సెలైన్‌లో విషం ఎక్కించుకుని హైదరాబాద్‌లో బద్వేలు డాక్టర్ ఆత్మహత్య

  • మనసు బాగోలేదని చెప్పి స్నేహితుడికి ఫోన్
  • అనుమానంతో మరో డాక్టర్‌కు సమాచారం అందించిన స్నేహితుడు
  • సెలైన్‌లో విషం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
మనసు బాగోలేదని స్నేహితుడికి చెప్పిన ఓ వైద్యుడు సెలైన్ బాటిల్‌లో విషం నింపి దానిని తనకు ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లా బద్వేలుకు చెందిన డాక్టర్ రాజ్‌కుమార్ (29) అమీర్‌పేట శ్యామ్‌కరణ్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. బీకేగూడలో అద్దెకు ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి స్నేహితుడికి ఫోన్ చేసి మనసు బాగాలేదని చెప్పారు.

ఆ తర్వాత స్నేహితుడు తిరిగి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన మరో వైద్యుడైన శ్రీకాంత్‌కు ఫోన్ చేసి చెప్పారు. ఆయన వెంటనే రాజ్‌కుమార్ గదికి వచ్చి చూడగా చేతికి సెలైన్‌తో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించచారు. రాజ్‌కుమార్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెలైన్‌లో విషం ఎక్కించుకున్నట్టు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Hyderabad
Ameerpet
Doctor
Suicide
Badvel

More Telugu News