Koppula Eshwar: ఈటల భారీ కుట్రకు ప్లాన్ చేశారు: మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన ఆరోపణలు

  • అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • టీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శల పర్వం
  • ఈటల కుట్రపై సమాచారం ఉందన్న కొప్పుల
  • రఘునందన్ బాటలోనే ఈటల నడుస్తున్నాడని వెల్లడి
Koppula Eashwar sensational comments on Eatala

మరో నెల రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుండగా, నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ కుట్రకు ప్లాన్ చేశారంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అక్టోబరు 12, 13, 14 తేదీల్లో తనపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసినట్టు సృష్టించి, కాళ్లకు, చేతులకు కట్లు కట్టుకుంటారని వెల్లడించారు.

దీనిపై తనకు అత్యంత విశ్వసనీయ సమాచారం అందిందని స్పష్టం చేశారు. అందుకే ఈ వ్యవహారాన్ని పాత్రికేయుల ముందుంచుతున్నానని వివరించారు. తనకు దెబ్బలు తగిలాయంటూ ఊరూరా, ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుక్కుంటారని తెలిపారు.

గతంలో బండి సంజయ్ గుండెపోటు వచ్చిందని నాటకం ఆడి గెలిచాడని, దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు కట్లు కట్టుకుని సానుభూతి సంపాదించారని, ఇప్పుడదే బాటలో ఈటల కూడా దరిద్రగొట్టు రీతిలో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బీజేపీ అంటేనే కుట్రపూరితమైన పార్టీ అని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.

More Telugu News