‘కొన్ని’ తప్ప ఇకపై ఏపీ ఉత్తర్వులన్నీ ఈ–గెజిట్​ లోనే

ఇకపై అన్ని ఉత్తర్వులను ఈ–గెజిట్ ద్వారా జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఏపీ ఈ గెజిట్’లోనే ప్రజలకు అవి అందుబాటులో ఉంటాయన్నారు.

జీవో ఐఆర్ వెబ్ సైట్ ను నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేందుకుగానూ వివరాలను ఈ–గెజిట్ లో పొందుపరచనున్నట్టు చెప్పారు. అయితే, కొన్ని ఉత్తర్వులు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండవన్నారు.

ప్రజలకు అవసరం లేని వ్యక్తిగత సమాచారం, తక్కువ ఖర్చులు, అధికారుల సెలవులు, రహస్య సమాచారాన్ని మాత్రం అందుబాటులో ఉంచబోమని స్పష్టం చేశారు. అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో ఈ గెజిట్ లో ఉత్తర్వులు అందుబాటులో ఉంటాయన్నారు.


More Telugu News