వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్ ప్రతిష్ఠను మరింత పెంచుతుంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy Says Venkateswara Swamy Temple Renovation Enhances Kodangal Prestige
  • కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన సీఎం
  • అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా గ్రూపులు పక్కన పెట్టాలన్న సీఎం
  • కొడంగల్‌ను రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న రేవంత్ రెడ్డి
వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలోని భక్తులకు కూడా ఈ ఆలయం మరింత చేరువగా ఉంటుందని అన్నారు. కొడంగల్‌లో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా యాగంలో పాల్గొన్నారు.

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణంతో పాటు కొడంగల్‌లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌలతాబాద్ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా గ్రూపులు పక్కనపెట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దగలుగుతామని అన్నారు.

ప్రతి గ్రామంలో చిన్న సమస్యలు, బేదాభిప్రాయాలు ఉంటాయని, అవన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి కట్టుగా ఉండాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పేదల తిరుపతిగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చాలామంది నాయకులు కలలు కన్నారని అన్నారు. కానీ వివిధ కారణాల చేత పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిందని వ్యాఖ్యానించారు.

నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో తలపెట్టిన పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆనాడు చదువుకోవడానికి కొడంగల్ వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు అందరూ కొడంగల్ వచ్చేలా అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు చురుగ్గా పనిచేయాలని అన్నారు.

కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్‌కు కూడా సూత్రప్రాయంగా అనుమతులు తెచ్చుకున్నామని అన్నారు. ఇక్కడ అపారమైన సున్నపురాయి ఉందని తెలిపారు. టేకులగోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చామని అన్నారు. రాబోయే ఆరేళ్లలో సిమెంట్ పరిశ్రమ నిర్మాణం జరిగితే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. పెద్ద ఇండస్ట్రియల్ పార్కును లగచర్ల దగ్గర నిర్మిస్తున్నట్టు చెప్పారు. కోస్గి నుంచి నేరుగా అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 300 అడుగుల రోడ్డు వేస్తున్నట్లు చెప్పారు.


Go Back to Shorts
Revanth Reddy
Venkateswara Swamy Temple
Kodangal
Telangana
Temple Renovation
Sri Mahalakshmi

More Telugu News