Nara Lokesh: అమ్మా కరెంట్ బిల్లు ఎంత? అక్కా కరెంట్ బిల్లు ఎంత? అని అడిగే దమ్ము ఇప్పుడుందా?: సీఎం జగన్ పై నారా లోకేశ్ ధ్వజం

Nara Lokesh fires on CM Jagan over electricity bills
  • ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచారంటూ లోకేశ్ ఆగ్రహం
  • 4 వేల కోట్లు సర్దేస్తున్నారని ఆరోపణ
  • ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని వ్యాఖ్య 
  • విద్యుత్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలని డిమాండ్
ఏపీలో విద్యుత్ బిల్లులు పట్టుకోకుండానే షాక్ కొడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ బాదుడు, దోపిడీకి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, వైసీపీ పాలనలో సంక్షేమం మూరెడు... విద్యుత్ బిల్లులు బారెడు అన్నట్టుగా తయారైందని విమర్శించారు. విద్యుత్ బిల్లులు చూస్తుంటే దిమ్మదిరిగిపోతోందని, సర్దుబాటు చార్జీల పేరుతో రూ.4 వేల కోట్లు సర్దేస్తున్నారని ఆరోపించారు.

"విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన కబుర్లు, విద్యుత్ చార్జీలు పెంచనంటూ ఇచ్చిన హామీలు ఇప్పుడు గుర్తులేవా? ఈ రెండున్నరేళ్లలో ఐదుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.9,069 కోట్లు దోచేశారు. అమ్మా కరెంట్ బిల్లు ఎంత? అక్కా కరెంట్ బిల్లు ఎంత? అని అడిగే దమ్ము ఇప్పుడుందా?" అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.

పలు రకాల పేర్లతో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు నారా లోకేశ్ పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News

Nara Lokesh
CM Jagan
Electricity Bills
Andhra Pradesh