Revanth Reddy: ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy once again hard comments on party defectors
  • ఫిరాయింపుదారులపై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్
  • దూకుడు తన లక్షణమని వెల్లడి
  • అది మారదని స్పష్టీకరణ
  • ఫిరాయిస్తే రాళ్లతో కొట్టిచంపుడేనని వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఇతర పార్టీల్లోకి వెళుతున్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ రేవంత్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారని విమర్శించారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాక, ఇటీవల వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. దానిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన మాటల తూటాలను మళ్లీ పేల్చారు. తాను గతంలో ఇండిపెండెంట్ గా గెలిచి ప్రతిపక్షంలో చేరానని వెల్లడించారు. అంతకుముందు జడ్పీటీసీగానూ ఇండిపెండెంట్ గానే గెలిచానని తెలిపారు. అప్పుడు తాను కేసీఆర్ కు సహకారం అందించానని, తెలంగాణ సాధన కోసమే అప్పట్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చానని రేవంత్ రెడ్డి వివరించారు.

ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని, త్వరలోనే ఘర్ వాపసీ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. దూకుడు తన సహజ లక్షణం అని, అది మారదని అన్నారు. ఇక పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టిచంపుడేనని తన వైఖరిని స్పష్టం చేశారు.
Revanth Reddy
Congress
Party Defectors
TRS
Telangana

More Telugu News