జై శ్రీరాం అనాలంటూ దాడి చేశారంటున్న వృద్ధుడు.. కట్టుకథ అంటున్న పోలీసులు!

Elderly man says beaten forced to chant Jai Shri Ram in Ghaziabad
  • ఈ నెల 5న ఘటన
  • వృద్ధుడిని నిర్బంధించి దాడి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • వృద్ధుడి ఆరోపణలు నిజం కాదన్న పోలీసులు
జై శ్రీరాం అని నినదించాలంటూ ఓ ముస్లిం వృద్ధుడిపై యువకులు దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ నెల 5న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుండగా, ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధిత వృద్ధుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బులంద్‌షహర్‌కు చెందిన అబ్దుల్ సమద్ ఈ నెల 5న ఘజియాబాద్ నుంచి లోని పట్టణానికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తనపై ముసుగు కప్పి అపహరించుకుని తీసుకెళ్లారని బాధిత వృద్ధుడు పేర్కొన్నాడు. ఆ తర్వాత ఓ ఇంట్లో నిర్బంధించి జై శ్రీరాం అనాలంటూ హింసించారని, పాకిస్థాన్ గూఢచారినంటూ గెడ్డం కత్తిరించారని వాపోయాడు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.

అయితే, వృద్ధుడు చెబుతున్నదంతా అబద్ధమని, కట్టుకథ అని దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు పోగొడతానంటూ నిందితులకు బాధితుడు తాయెత్తులు ఇచ్చాడని, వాటి వల్ల ప్రభావం లేకపోవడంతో అతడిని నిర్బంధించి దాడి చేసినట్టు తేలిందని వివరించారు.
Go Back to Shorts
UP
Jai Sri Ram
Ghaziabad

More Telugu News