11 మంది బీజేపీయేతర సీఎంలకు జగన్ అందుకే లేఖలు రాశారు: సోము వీర్రాజు ఫైర్

Somu Veerraju fires on AP CM Jagan
  • కరోనా విషయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది
  • ప్రభుత్వం ఒక్క టీకా కూడా కొనుగోలు చేయలేదు
  • తిరుపతిలో 13 మంది చనిపోయారని చెప్పి 23 మందికి డబ్బులు ఇచ్చారు
కరోనా వైరస్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా కట్టడి విషయంలో పూర్తిగా విఫలమైన జగన్ తన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు 11 మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని ఆరోపించారు.

ఈ నెల 5వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం 25.30 కోట్ల డోసులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించిందని పేర్కొన్న వీర్రాజు..  25 శాతం టీకాలను రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా ఏపీ ఒక్క టీకాను కూడా కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఇతర రాష్ట్రాలు లక్షల్లో టీకాలు వేశాయని, కానీ ఏపీలో మాత్రం ఇది 60 వేలు దాటలేదని అన్నారు.  

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన టీకాలను కూడా ఏపీ ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి నిజాయతీకి ఇది మచ్చుతునక అని ఎద్దేవా చేశారు. తిరుపతి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 13 మంది చనిపోయారని చెప్పి 23 మందికి డబ్బులు ఇచ్చారని సోము వీర్రాజు పేర్కొన్నారు.
Go Back to Shorts
Somu Veerraju
BJP
Andhra Pradesh
YS Jagan

More Telugu News