'పిచ్'పిచ్చిగా తిరిగిన పింక్ బాల్... మూడో టెస్టులో భారత్ దే విజయం
- రెండ్రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టు
- 10 వికెట్ల తేడాతో టీమిండియా జయభేరి
- 49 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించిన ఓపెనర్లు
- స్పిన్నర్లకు స్వర్గధామంలా నరేంద్ర మోదీ స్టేడియం పిచ్
- మార్చి 4 నుంచి చివరి టెస్టు
స్పిన్నర్ల జాతరను తలపించేలా సాగిన వికెట్ల వేటలో చివరికి భారత్ దే పైచేయిగా నిలిచింది. ఇంగ్లండ్ ను రెండు ఇన్నింగ్స్ ల్లోనూ తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన టీమిండియా... 49 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 10 వికెట్ల తేడాతో మూడో టెస్టును కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ 3 ఫోర్లు 1 సిక్స్ తో 25 పరుగులు చేయగా, శుభ్ మాన్ గిల్ 1 ఫోరు, 1 సిక్స్ తో 15 పరుగులు సాధించిన వేళ... ఒక్క వికెట్టూ నష్టపోకుండా భారత్ గెలుపుతీరాలకు చేరింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... టీమిండియాను తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్టూ తీయలేకపోయారు. పిచ్ స్వభావాన్ని అప్పటికే ఆకళింపు చేసుకున్న భారత ఓపెనర్లు మెరుగైన ఫుట్ వర్క్ తో ఇంగ్లండ్ స్పిన్ దాడులను ఎదుర్కొని చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లను తీసుకుని వ్యూహాత్మకంగా దారుణమైన తప్పిదానికి పాల్పడింది. పిచ్ పేస్ కు సహకరించకపోగా, తొలి రోజు నుంచే స్పిన్నర్లకు తోడ్పాటు అందించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులు చేయగా, భారత్ 145 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకే చేతులెత్తేసింది.
ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు తీయడం విశేషం అని చెప్పాలి. అశ్విన్ కు 7 వికెట్లు లభించాయి. ఈ టెస్టు విజయం అనంతరం నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1తో ముందంజలో నిలిచింది. ఇరుజట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు మార్చి 4 నుంచి ఇదే మైదానంలో జరగనుంది.